Prisoners Release | రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ.50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన వారంతా ప్రతి మూడునెలలకోసారి జ్లిలా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. విడుదలయ్యే ఖైదీల్లో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. విడుదలయ్యే ఖైదీలను ఆయా జైళ్ల నుంచి చర్లపల్లి కేంద్ర కారాగానికి తరలించనున్నారు. విడుదలకానున్న ఖైదీలతో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా బుధవారం సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఖైదీల విడుదలకు రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. అయితే, ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. వారికి జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు పెట్రోల్ బంకులతో పాటు పలుచోట్ల ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తున్నది.