Medical colleges | మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రవాణా, వసతి సదుపాయలకు డిమాండ్ పెరుగుతుంది. కాలేజీల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయి. ఫలితంగా సమీప గ్రామాల ప్రజల ఆర్థికస్థితి మెరుగవుతుంది. మరీ ముఖ్యంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో మెడికల్ టూరిజం ఊపందుకుంటుంది.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో 850 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 2,850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇందులో కన్వీనర్ కోటా సీట్లు 1500 మాత్రమే. ఏటా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేవారు. ఓసీలకు వందల్లో, రిజర్వ్డ్ అభ్యర్థులకు గరిష్ఠంగా పది వేలలోపు ర్యాంకు వచ్చినవారికే ఎంబీబీఎస్ సీటు దొరికేది. దాదాపుగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివినవారికే సీట్లు దక్కేవి. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు డాక్టర్ చదువు కలగానే మిగిలిపోయింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఫలితంగా రాష్ట్రంలో ఈ ఏడాదికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,590కి పెరిగింది. అంటే.. 9 ఏండ్లలోనే ఐదున్నర రెట్లు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 8,340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో లక్షల ర్యాంకు వచ్చినా సీటు దొరికే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది రెండో విడుత కౌన్సిలింగ్లో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన బీసీ-సీ విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది.
మరోవైపు కొత్త కాలేజీలతో అందుబాటులోకి వస్తున్న ఎంబీబీఎస్ సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దకేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 2014తర్వాత ఏర్పాటైన కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను 100 శాతం తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేసింది. హైకోర్టు సైతం దీనిని సమర్థించడంతో అదనంగా 520 సీట్లు తెలంగాణ బిడ్డలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో బీ క్యాటగిరి సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే చెందేలా ప్రభుత్వం నిరుడు లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఫలితంగా 1,820 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
2014నాటికి 5
9 ఏండ్లలో 29
పెరుగుదల 480%
మెడికల్ సీట్లు
2014నాటికి 850
9 ఏండ్లలో 4590
పెరుగుదల 440%
ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్లు 8,340 కి పెరిగాయి. వచ్చే ఏడాది కోసం ప్రభుత్వం ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. అవి కూడా కలిపితే సీట్ల సంఖ్య 9140కి చేరుతుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే ప్రైవేటు కాలేజీలు కూడా కలిపితే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10వేలకు చేరుకోనున్నది. అంటే.. ఒక సంవత్సరానికి తెలంగాణ నుంచి 10 వేల మంది డాక్టర్లు తయారవుతారన్నమాట.
మెడికల్ కాలేజీలు వైద్యవిద్య, వైద్యసేవలకు మాత్రమే పరిమితం కాదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతున్నాయి. మెడికల్ కాలేజీలో గరిష్ఠంగా 36 విభాగాలు పనిచేస్తాయి. ఆయా విభాగాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిండెంట్లు, నర్సులు, అనుబంధ విభాగాల సిబ్బంది.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. బోధన, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 1500-2000 మంది పనిచేస్తుంటారు. ఇందులో అత్యధిక శాతం మంది స్థానికంగా నివాసం ఉంటారు. దీంతో అద్దెల రూపంలో ఆదాయం పెరుగుతుంది. సెక్యూరిటీ, క్లీనింగ్ వంటి పనులు స్థానికులకు ఉపాధి కల్పిస్తాయి. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిటల్కు వచ్చే రోగులు, సహాయకుల కోసం రవాణా, వసతి సదుపాయాలు, హోటళ్లు, మెడికల్ దుకాణాలు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అంతేకాదు.. మెడికల్ కాలేజీలు రియల్ ఎస్టేట్కు పెట్టుబడుల ఆకర్షణ కేంద్రాలుగా మారుతాయి. వాటి చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతాయి.
తమ కుటుంబంలో ఒక్క డాక్టరైనా ఉండాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు పంపించేవారు. ఒకవైపు ఎంబీబీఎస్ చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస.. ఇలా విద్యార్థులు నరకయాతన పడేవారు. కరోనా విపత్తు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సందర్భాల్లో విదేశాల్లోని తమ పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన వర్ణణాతీతం. ఉక్రెయిన్ యుద్ధంతో తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థుల చదువు ఇప్పటికీ గాడిన పడలేదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు ఏర్పాటు, లోకల్ రిజర్వేషన్ ఫలితంగా విద్యార్థులకు అపార అవకాశాలు రావడంతోపాటు తల్లిదండ్రులకు అరి గోస తప్పింది. కండ్లముందే తమ పిల్లలను చదివించుకునే అవకాశం దక్కింది. ఆర్థిక భారం కూడా తగ్గడంతో వారంతా గుండెనిబ్బరంతో ఉన్నారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అనుబంధంగా దవాఖాన ఏర్పాటవుతుంది. కనీసం 300 పడకలతో అందుబాటులోకి వస్తుంది. సీహెచ్సీల్లో 8 విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఏరియా దవాఖానల్లో 14 విభాగాలు, జిల్లా దవాఖానల్లో గరిష్ఠంగా 22 విభాగాలు సేవలు అందిస్తుంటాయి. కానీ మెడికల్ కాలేజీలో గరిష్ఠంగా 36 రకాల విభాగాల సేవలు దొరుకుతాయి. ఇవన్నీ స్పెషాలిటీ విభాగాలే. ఫలితంగా ప్రజలకు అత్యంత చేరువలోనే స్పెషాలిటీ వైద్యం అందుతుంది. పెద్ద సమస్య వచ్చినా వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్కు వెళ్లాల్సిన పని ఉండదు. 70-80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రంలో స్పెషాలిటీ సేవలు అందుతాయి. ఫలితంగా ఎన్నో ప్రాణాలు నిలబడతాయి.
‘డాక్టర్ కావాలంటే మాటలా.. రూ.లక్షలు, రూ.కోట్లతో వ్యవహారం’. ఒకప్పుడు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో డాక్టర్ కావడం ఒక కల. కానీ ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అవకాశాలు పెరగడమే కాదు.. ఉచితంగా ‘డాక్టర్’ పట్టా అందుకునే అవకాశం కలిగింది. వైద్య విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజుతోపాటు సీడీఎస్, ఈ లైబ్రరీ, లైబ్రరీ, సెంట్రల్ స్టోర్, కాషన్ డిపాజిట్, అకడమిక్ డెవలప్మెంట్ ఫండ్, నాన్ గవర్నమెంట్ ఫండ్ వంటివి ఉంటాయి. దవాఖాన ఫీజు అదనం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో వైద్యవిద్య అభ్యసించాలన్నా కనీసం రూ.5-6 లక్షల వరకు ఖర్చవుతుంది. మేనేజ్మెంట్ కోటా అయితే రూ.50 లక్షలకుపైమాటే. ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రం గరిష్ఠంగా రూ.లక్షలోపు ఖర్చుతోనే పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే అత్యాధునిక వైద్యానికి తెలంగాణ చిరునామాగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి రోగులు హైదరాబాద్కు వచ్చి చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్తున్నారు. ఇలా దేశ మెడికల్ టూరిజంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నది. కొన్ని కార్పొరేట్ దవాఖానలకు విదేశీ రోగుల తాకిడి తట్టుకోలేనంతగా ఉన్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త మెడికల్ కాలేజీలతో భారీగా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తయిన విద్యార్థులు అందుబాటులోకి వస్తారు. నిపుణులైన వైద్యుల సంఖ్య పెరిగే కొద్దీ అదే స్థాయిలో వైద్య సేవల్లో నాణ్యత పెరిగి, ప్రతి ఒక్కరికీ నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా తెలంగాణకు మెడికల్ టూరిజం మరింత పెరుగుతుంది.
ఒకప్పుడు పెద్ద వ్యాధి వస్తే హైదరాబాద్లోని గాంధీ, నిమ్స్, ఉస్మానియా దవాఖానలే దిక్కు. అత్యవసర సమయాల్లో మారుమూల జిల్లాల నుంచి వందల కిలోమీటర్ల మేర పలు గంటలు ప్రయాణించి దవాఖానలకు చేరేవారు. ఆలస్యం కారణంగా ఎన్నో ప్రాణాలు మార్గమధ్యంలోనే పోయేవి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రజలకు కాస్త అండగా ఉండేవి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో వైద్యసేవల వికేంద్రీకరణ జరిగింది. అత్యాధునిక పరికరాలు, నిపుణులైన డాక్టర్లు మారుమూల జిల్లా కేంద్రాలకు అందుబాటులోకి వచ్చారు. ఎలాంటి వ్యాధికి అయినా మెడికల్ కాలేజీల్లోని నిపుణులు వైద్యం అందిస్తారు.
విదేశీ వైద్యవిద్య సిలబస్తో పోల్చితే మన దేశంలోని మెడికల్ కాలేజీల్లో అమలవుతున్న సిలబస్ అత్యాధునికమైనది, కఠినమైనది. కొవిడ్ సమయంలో చైనా నుంచి, యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన విద్యార్థులు ఇక్కడ తమ చదువును ఇక్కడ కొనసాగించేందుకు వారు ప్రయత్నించారు. ఆయా దేశాల సిలబస్తో పోల్చితే మన దేశంలో వైద్య విద్య కనీసం 40-50 శాతం అడ్వాన్స్డ్గా, అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలోనే మన విద్య నాణ్యత గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మెడికల్ కాలేజీలకు తెలంగాణ కేంద్రంగా మారిన నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో వందలాది మంది విదేశీ విద్యార్థులు తెలంగాణకు వచ్చి ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చదివే అవకాశం ఉంటుంది.