Telangana | సాధారణంగా చిన్న పిల్లలు పెన్నులతో ఆడుకోవడం చూస్తూనే ఉంటాం.. పిల్లలు మారాం చేస్తున్నారని అలా పెన్నులు, ఇతరత్రా వస్తువులు ఇచ్చి వాళ్లను బుజ్జగిస్తాం.. కానీ దాని వెనుక ఉన్న ప్రమాదాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటాం.. దీనివల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా రావొచ్చు. తాజాగా భద్రాచలం పట్టణంలోని సుభాష్నగర్లో జరిగిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ!.
నాలుగేళ్ల చిన్నారి రియాన్షిక సోమవారం మంచంపై ఆడుకుంటుండగా కిందపడింది. దీంతో ఆమె చేతిలో ఉన్న పెన్ను ఎడమ చెవిపైన తలకు గుచ్చుకుంది. దాదాపు సగం పెన్ను చిన్నారి తలలోకి పోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన తల్లిండ్రులు చిన్నారిని భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడ న్యూరోసర్జన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఖమ్మం తరలించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన వైద్యులు తలలోకి దిగిన పెన్నును తొలగించారు. సర్జరీ తర్వాత బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కావడంతో చిన్నారి ఆరోగ్యం విషమించింది. దీంతో బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.