కామారెడ్డి, జూన్ 24: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ప్రశ్నించారు. ఎంతో గౌరవమిచ్చిన కేసీఆర్కు వెన్నుపోటు పొడవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కామారెడ్డిలోని గంప నివాసంలో వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘పోచారంను సీనియర్ నాయకుడిగా గుర్తించి కేసీఆర్ 2014లో వ్యవసాయశాఖ మంత్రిగా, 2018లో తెలంగాణ శాసన సభాపతిగా అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించారని, బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్, బాన్సువాడ నియోజకవకర్గ ప్రజలను మోసం చేసిన పోచారంను, ఆయన కుటుంబాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని తెలిపారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.