హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయంచేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా చేశారు’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా, వారిని నిరాశలోకి నెట్టేసేలా క్యాబినెట్ సమావేశం ముగించి ఉసూరుమనిపించారని ఆరోపించారు. శనివారం నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, అంతకన్నా ఎకువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి కాంగ్రెస్కు ఓటేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలను ఇచ్చారు తప్ప, కొత్తగా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని వెల్లడించారు.
కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత.. ఉద్యోగాల కోసం రోడ్డునపడి అలమటించవలసిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. గ్రూప్-1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు ఇబ్బందికరంగా మారిందని వివరించారు. వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని, బాధ్యతగల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలక సమస్యలు, బాధలు, వినతులను మీ (సీఎం) దృష్టికి తెస్తున్నానని తెలిపారు. ఈ అంశాలపై దృష్టి పెట్టి వెంటనే తగు న్యాయం చేయాలని కోరతున్నానని లేఖలో పేర్కొన్నారు.
హరీశ్రావు లేఖలో డిమాండ్ చేసిన అంశాలు:
1. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చాం. వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్కు 1:50 నిష్పత్తిలో కాకుండా, 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నానను. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయటం కొత్తేమీ కాదు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నపుడు గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు.
ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్-2 నోటిఫికేషన్లో 1:15 గా పేరొన్నా, అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్కు ఎంపిక చేశారు. గ్రూప్-1 అనేది యూపీఎస్సీ మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావటం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్కు ఎంపిక చేయటం వల్ల గ్రామీణప్రాంత విద్యార్థులకు గ్రూప్-1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఇదే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం కావటం లేదు. గతంలో మీరు చేసిన డిమాండ్ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉన్నది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలో ఉంటే వేరే మాటగా ప్రవర్తించటం ఎందుకు? గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్కు 1:100 చొప్పున ఎంపికచేసి ఉద్యోగార్థులకు న్యాయం చేయాలి.
2. గ్రూప్-2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్- 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నాను.
3. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తకువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష ఉన్నది. ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొన్నది. కాబట్టి ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎకువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
4. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆరు నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లు జారీచేయాలని కోరతున్నాను.
5. మీరు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మ్యానిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేసేలా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నాను.
6. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయి మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీవో నంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జీవో 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిషరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్ధానాలను గుర్తుచేసేందుకు, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన ఈ లేఖను సహృదయంతో అర్థం చేసుకొని వెంటనే స్పందించి సమస్యలు పరిషరిస్తారని నమ్ముతున్నాను.