విద్యుత్తు కొనుగోలు, ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నది. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నది. ప్రజలకు నిజాలేంటో తెలియాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ సాక్షిగా విచారణకు డిమాండ్ చేశాం. మేం తప్పు చేసి ఉంటే విచారణ ఎందుకు కోరుతం.
-మాజీమంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేలాలంటే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ క్రమంలో నాటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్కు నోటీసులిచ్చి విచారణకు పిలవాలని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. విద్యుత్తు కొనుగోలు, ఒప్పందాల్లో ప్రత్యేకించి సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అంశాలపై వాస్తవాలు తేలాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు, నాటి కేంద్ర మంత్రుల నుంచి కూడా సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కమిషన్కు సూచిస్తానని చెప్పారు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే గత ప్రభుత్వ నిర్ణయాలతో రూ.6వేల కోట్ల నష్టమని కొన్ని పత్రికలకు లీకులు ఇచ్చిందెవరు? అందులో వారి పాత్ర ఏమిటి? వంటి విషయాలు బయటికి రావాలని, ఇందుకోసం సదరు పత్రికలను కూడా కమిషన్ విచారించాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్రెడ్డితోకలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నుంచి పిలుపు వచ్చిందని, తాను హాజరై కమిషన్కు సహకరిస్తానని చెప్పారు. విద్యుత్తు కొనుగోలు, ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నదని, ప్రజలకు నిజానిజాలు తెలియాలనే ఉద్దేశంతో తామే విచారణకు అసెంబ్లీసాక్షిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ నిజ నిర్ధారణకు రావాలంటే నాటి వ్యవహారాల్లో అన్నిపక్షాల వాదనలు వినాలని కోరారు.
కమిషన్కు అన్ని విషయాలూ వెల్లడిస్తా
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డికి కమిషన్ నుంచి తనకు ఉత్తరం అందిందని జగదీశ్రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ, జెన్కో అధికారులు, బీహెచ్ఈఎల్ సహా ఇతర సంస్థల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ, తనకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని అన్ని విషయాలూ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై బురదజల్లటమే పనిగా పెట్టుకున్న వ్యక్తులు, శక్తుల ప్రయత్నాలను కమిషన్కు వివరిస్తానని చెప్పారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో భాగమైన సంస్థలు, బాధ్యులను విచారణలో భాగస్వా మ్యం చేయాలని, నాటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్ను విచారణకు పిలవాల్సిన అవసరముందని చెప్పారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఇటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్ను విచారణకు రావాలని చెప్పి, సమాచారం సేకరించినప్పుడు అటునుంచి కూడా ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కమిషన్కు సూచిస్తానని చెప్పారు. ఈఆర్సీపై విచారణ చేస్తున్నప్పుడు ఎన్జీటీని విచారించే పరిధి ఉందా? లేదా? ఉంటే వాళ్ల ను కూడా విచారణకు పిలవాలనే విషయాన్ని కమిషన్కు నివేదిస్తానన్నారు.
పత్రికలకు లీకులిచ్చిందెవరు?
విచారణ సమయంలోనే జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఈనెల 11న ‘ఛత్తీస్గఢ్ ఒప్పందంతో నష్టం జరిగింది.. లెక్కలు కట్టడమే తరువాయి’ అన్నట్టుగా వ్యాఖ్యానించిందని జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూరేలా కొన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికగా రూ.6000 కోట్ల నష్టం జరిగిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పత్రికలకు కూడా నోటీసులిచ్చి విచారణకు పిలవాలని తాను కమిషన్ ముందు పెడతానన్నారు. ఏ ఆధారంతో వార్తలు రాశారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. 7వేల కోట్ల చెల్లింపులు జరిగాయని, అందులో 6వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని పేర్కొనటం గత ప్రభు త్వ ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే చర్యేనని తాను కమిషన్కు చెప్తానన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటికొస్తాయని, అలా చేయకపోతే ఏకపక్షంగా అవుతుందని, నిర్దేశిత తీర్పును ఇచ్చి బద్నాం చేయాలనుకుంటే గౌరవంగా విచారణ నుంచి తప్పుకోవాలని సలహా కూడా ఇస్తామన్నారు.
ఈనెల చివరికల్లా పెట్టుబడిసాయం ఇవ్వాలి ;మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
రైతులకు ఇప్పటికే పెట్టుబడిసాయం ఇవ్వాల్సి ఉందని, కనీసం ఈనెలాఖరు వరకైనా వేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా ప్రారంభమైందని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి గతంలోనే ప్రకటించారని, ప్రారంభమైన కార్యక్రమ విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు? వారికి ఉన్న భూమి ఎంత? తదితర విషయాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఈ క్రమంలో ఇంకా తేలాల్సింది ఏమిటని ప్రశ్నించారు. ఏకకాలంలోనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.