D.Srinivas | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.డీఎస్ భౌతికకాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్లురవి, కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీ హన్మంతరావు, మధుయాష్కీగౌడ్, అంజన్కుమార్ యాదవ్, జీ నిరంజన్ నివాళులర్పించారు.
డీఎస్ మృతిపై ప్రధాని మోదీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు.కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. డీ శ్రీనివాస్ మరణంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మాజీ సీఎం జగన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజనర్సింహ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు.
డీఎస్ భౌతికకాయానికి కేటీఆర్, హరీశ్ నివాళులర్పించి మాట్లాడారు. రాజకీయాల్లో అజాతశత్రువు డీ శ్రీనివాస్ అని,డీఎస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్ మరణం రాష్ర్టానికి తీరని లోటు అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
డీ శ్రీనివాస్ అంత్యక్రియలను ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి డీఎస్ భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్కు తరలించారు.
నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1948, సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో కార్యకర్తగా చేరారు. 1989లో తొలిసారిగా నిజామాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో ఓడిపోయినా 1999, 2004లో వరుసగా గెలిచారు. 2004లో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించి, వైఎస్ క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2009లోనూ డీఎస్కు పార్టీ అధిష్ఠా నం పీసీసీ పీఠాన్ని కట్టబెట్టింది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలై ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన, స్వరాష్ట్రంలో 2014 జూన్ 3 నుంచి 2015, జూలై 2 దాకా శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన డీఎస్ను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. ఆయనకు ఏ పదవీ ఇవ్వకుండా దూరం పెట్టింది. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరదీశారు. బీఆర్ఎస్లో ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. 2016లో రాజ్యసభ సభ్యుడ్ని చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో బీఆర్ఎస్కు డీఎస్ దూరమయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయన కొడుకుల్లో ఒకరు కాంగ్రెస్లో, మరొకరు బీజేపీలో కొనసాగడం విశేషం. 2022లో ఎంపీ పదవి ముగిసిన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన డీఎస్, వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు.