ఆదిలాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాథోడ్ రమేశ్ (57) శనివారం కన్నుమూశారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఆదిలాబాద్ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ఆయన కోమాలోకి చేరుకోవడంతోపాటు ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా గుండెపోటుతో మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద మృతిచెందారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్కు చెందిన రాథోడ్ రమేశ్ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సుదీర్ఘంగా 35 ఏండ్లు రాజకీయాల్లో ఉన్నారు. 1989లో నార్నూర్ జడ్పీటీసీగా గెలిచారు. 1999లో టీడీపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
2006లో ఆసిఫాబాద్ నుంచి జడ్పీటీసీగా గెలిచిన రాథోడ్ రమేశ్ ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, ఎంపీగా ఆయన ప్రజలకు విశేష సేవలు అందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆదివారం ఉట్నూర్ ఎక్స్రోడ్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.