Bhadradri Thermal Plant | మణుగూరు టౌన్, జూన్ 29 : పిడుగుపాటుతో జీటీ ట్రాన్స్ఫార్మర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో గల ఒకటో యూనిట్పై శనివారం రాత్రి పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు యూనిట్-1లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిపమాక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. యూనిట్-1, 2ను స్టేజ్-1గా, యూనిట్-3, 4ను స్టేజ్-2గా పరిగణిస్తుండగా.. జీటీ ట్రాన్స్ఫార్మర్ స్టేజ్-1 వద్ద అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన సిబ్బంది హడావుడిగా విద్యుత్ ఉత్పత్తిని యూనిట్-1, లేదా యూనిట్ -2లో నిలిపివేశారా.. అన్నది తేలాల్సి ఉంది.
అధికారులు పిడుగుపాటు అని ధ్రువీకరిస్తుండగా, స్విచ్ యార్డ్ వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా జీటీ ట్రాన్స్ఫార్మర్ వద్ద అగ్నికీలలు ఎగిసిపడటంతో పిడుగుపాటా? సాంకేతిక లోపమా.. అన్నది తేలాల్సి ఉంది.