Vijaya Dairy | హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): ‘బిల్లులు వచ్చేటప్పుడు వస్తయ్… మీ ఇష్టముంటే పాలు పోయండి.. లేదంటే బంద్ చేయండి’ ఇదీ పాల బిల్లులు అడిగిన రైతులపై విజయ డెయిరీ అధికారుల బెదిరింపులు. రైతులు పాలు పోస్తేగానీ మనుగడ సాగించలేని డెయిరీ అధికారులు, అది వారి ప్రైవేటు కంపెనీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పదిహేను రోజులకోసారి రైతులకు పాల బిల్లులు చెల్లించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నది. మొదటి మూడు నెలల బిల్లులను ఇటీవలె చెల్లించారు. ఇంకా మూడు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులు పాల బిల్లులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా విజయ డెయిరీ హైదరాబాద్ కేంద్రంలోని ఓ జనరల్ మేనేజర్ దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. ‘మీ ఇష్టముంటే పాలు పోయండి లేకపోతే బంద్ చేయండి. అంతేగానీ బిల్లుల కోసం విసిగించొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా రైతులు వాపోయారు.
పాడి రైతులకు విజయ డెయిరీ చెల్లించాల్సిన పాల బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ. 120 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా తెలిసింది. ప్రతి రోజు సుమారు లక్షన్నర మంది రైతుల నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తున్నది. ప్రతి రోజు రైతులకు కనీసంగా రూ. 1.5కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో బర్రెలకు అవసరమైన దాన, మందులను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పాడి రైతులకు విజయ డెయిరీ ఆధ్వర్యంలోనే ముద్ర రుణాలతో పాటు ఇతర రుణాలను ఇప్పించి గేదెలను కొనుగోలు చేయించింది. రైతులు పాలు విక్రయించిన బిల్లుల నుంచి ప్రతి నెల బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని విజయ డెయిరీ అధికారులే కట్ చేసి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఈఎంఐల రూపంలో చెల్లించేవారు. గత ప్రభుత్వంలో బిల్లులకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఆర్నెళ్ల నుంచి పాల బిల్లులు ఆలస్యమవుతుండడంతో అధికారులు బ్యాంకులకు డబ్బులు చెల్లించలేకపోతున్నారు. ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటిమీదికి వచ్చి రచ్చ చేస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ఆస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఈఎంఐలు చెల్లించకపోవడంతో వారిని బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్నాయి. రైతుల సిబిల్ స్కోర్ కూడా పడిపోతున్నది. భవిష్యత్లో రైతులకు బ్యాంకుల్లో రుణం రావడం కష్టంగా మారుతున్నది.
విజయ డెయిరీలో కొద్ది రోజులుగా పాలన పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం శాపంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాల సేకరణ, మార్కెటింగ్లో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ ప్రభావం సంస్థపై పడుతుందని తెలిసింది. దీంతో సంస్థను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినట్టుగా తెలిసింది. కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంతో పాటు జిల్లా స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.