మంచిర్యాల : కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించ లేదని, గోల్మాల్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం(Ponakal PACS office) ఎదుట పురుగుల మందు డబ్బాతో ధర్నాకు(Farmers dharna) దిగారు. గత యాసంగిలో బాదంపల్లి, చింతలపల్లెకు చెందని 14 మంది రైతులం ధాన్యాన్ని సహకార సంఘానికి విక్రయించామని, వాటికి సంబంధించిన రూ. 12 లక్షలు ఇప్పటికీ ఖాతాల్లో పడలేదని మండిపడ్డారు.
జిల్లా డిప్యూటీ ఆడిట్ ఆఫీసర్ రాథోడ్ బిక్కు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం డబ్బులను అక్రమంగా వినియోగించుకొని రైతులను మోసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ రవి, నాయకులు దాసరి తిరుపతి, కమలాకర్, జికల లక్ష్మీరాజం పాల్గొన్నారు.