గూడూరు, జూన్ 30 : అదును దాటిపోతుండటంతోపాటు పంటపెట్టుబడి సాయం లేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మచ్చర్లకు చెందిన గుగులోత్ దస్రు (52) తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసేందుకు ఈ ఏడాది పెట్టుబడి లేక, సీజన్ కూడా దాటి పోతుండటంతో చేసేదేమీలేక శనివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దస్రుకు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఆగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది వానకాలం పంటకు సంబంధించి ఇప్పటి వరకు రైతుభరోసా సహాయం అందకపోవడంతోపాటు గతంలో దస్రుకు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.