Bojedla Prabhakar | ఖమ్మం, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చింతకాని : ఖమ్మంజిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని పలు రాజకీయపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొండబాల కోటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రైతు సంఘం నాయకులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు, పార్టీడివిజన్ కార్యదర్శి ఝాన్సీ, జిల్లా నాయకులు లక్ష్మణ్ తదితరులు ప్రభాకర్ కుటుంబసభ్యులను బుధవారం పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా తన కొడుకు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, తమ 7.10 ఎకరాల్లో మూడెకరాలను గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు చెరువులో కలిపిన తీరును ప్రభాకర్ తండ్రి వీరభద్రయ్య వివరించారు. కొడుకు మృతితో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని, 70ఏండ్ల వయస్సులో దివ్యాంగుడినైన తాను కుటుంబపోషణ కోసం ఏ పనీ చేయలేనని, ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభాకర్ కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో తమ పొలాన్ని కొందరు కక్షపూరితంగా చెరువులో కలపడం దారుణమని, ఈ విషయంపై కలతచెంది తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని, ప్రభాకర్కు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, కోడలు సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. తన కొడుకు మరణానికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభాకర్ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తే, అన్యాయంపై కాకుండా వీడియోపై రాద్ధాంతం చేయడం తమ కుటుంబాన్ని మరింత బాధపెడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశాడు.
ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని తమ ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తిచేశారు. ఆత్మహత్యకు కారకులైన కిశోర్ వంటి నాయకులను తప్పిస్తే ప్రభాకర్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభాకర్ ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారని, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేయడం తమ కుటుంబానికి కొంత ఊరట కలిగించేదిగా ఉందని చెప్పారు.
Kishore
రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ కొనసాగుతున్నదని, ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
చింతకాని తహసీల్దార్ రమేశ్ను రైతు ప్రభాకర్ కుటుంబసభ్యులు బుధవారం ఘెరావ్ చేశారు. ప్రభాకర్ పొలం పరిశీలనకు తహసీల్దార్ తన కార్యాలయ సిబ్బంది, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల బృందంతో కలిసి వెళ్లగా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. గతంలో వినతిపత్రం ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తహసీల్దార్ రమేశ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, పొలం హద్దులను త్వరలో కల్పిస్తామని తెలిపారు.