నెల్లికుదురు, జూన్ 29 : అప్పుల బాధ మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. హేమ్లాతండా శివారు బోడ్యాతండాకు చెందిన బానోత్ బాలు (50) తనకున్న మూడు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంట సాగుతోపాటు వ్యవసాయ బావి తవ్వించడానికి తండావాసుల వద్ద రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు.
అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుండటంతో తనకున్న 3 ఎకరాల భూమి నుంచి 25 గుంటలను విక్రయించాడు. అయినా, అప్పు తీరకపోవడం, పంట దిగుబడి కూడా రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదన చెందుతున్నాడు. శుక్రవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గడ్డిమందు తాగి, విషయాన్ని తన పెద్ద కొడుకు బానోత్ నవీన్కు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న నవీన్ వెంటనే తన తమ్ముడు ప్రవీణ్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడు వచ్చి మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం మృతి చెందాడు. కొడుకు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.