మెదక్ : మెదక్(Medak) జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గురువారం పాతకక్షలు, భూతగాదాతో(Land disputes) బండరాయితో మోది ఓ రైతును హత్య(Farme killed) చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్(50) ఎప్పటిలాగే ఉదయం నిద్రలేచి 9గంటల ప్రాంతంలో తన పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే పొలం వద్ద కాపుకాసిన పక్క చేనువారు రైతు అశోక్పై ఒక్కసారిగా బండరాళ్లు, కట్టెలతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన అశోక్ అ్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు రాగుల అశోక్, నిందితులు చేపూరి రమేశ్ కుటుంబానికి మధ్య పదేండ్లుగా గెట్టు పంచాయితీ ఉన్నట్లు సమాచారం. చేపూరి రమేశ్ కుటుంబమే ఈ హత్యకు పాల్పడిందని గ్రామస్తులు, బాధిత కుటుం బీకులు ఆరోపించారు. ఆగ్రహంతో గ్రామస్తులు నిందితుడి ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లగా అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. కోపంతో గ్రామస్తులు నిందితుడి పశువుల కొట్టం, గడ్డివాములను దహనం చేశారు.
రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్సై రంజిత్ పోలీసు బలగాలతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అశోక్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాతకక్షలు, భూతగాదాతోనే ఈ హత్య జరిగినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి మీడియాకు తెలిపారు.