హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): జంతువుల రవాణాకు సంబంధించి 2017లో రూపొందించిన నిబంధనలు ఏవిధంగా అమలవుతున్నాయో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు రవాణా నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా కోర్టు పరిగణించింది. కౌంటర్ దాఖలు చేయాలని హోం, రవాణా, పశుసంవర్ధక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు డీజీపీని, జీహెచ్ఎంసీని, పోలీస్ కమిషనర్లను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
అటవీ-పర్యావరణ, కాలుష్య నియంత్రణ అధికారుల బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : అటవీ-పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోమెంబర్ సెక్రటరీగా రవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు, నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై చర్చించారు.
ప్రాధామ్యాల వారీగా బడ్జెట్ ప్రతిపాదించాలి
హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): ప్రాధామ్యాలవారీగా ప్రాజెక్టులకు బడ్జెట్ను ప్రతిపాదించాలని ఇరిగేషన్శాఖ అధికారులకు ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్ సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై చీఫ్ ఇంజినీర్లతో జలసౌధలో సోమవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రాజెక్టులవారీగా అవసరాలపై చర్చించారు.
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లో ప్రవేశాల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు ఆన్లైన్ ఆడ్మిషన్ రిక్వెస్ట్ ఫామ్ను అప్లోడ్ చేసింది.
నార్కోటిక్ యాక్టుపై ఎక్సైజ్ సిబ్బందికి శిక్షణ
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఎక్సైజ్ ఉన్నతాధికారులకు శిక్షణ ఇచ్చారు. ఏడేండ్లు జైలు శిక్ష కలిగిన కేసు నమోదు చేస్తే పూర్తి స్థాయిలో వీడియో తీసి న్యాయమూర్తి ముందు ఎలా ఉంచాలనే విషయంపై అవగాహన కల్పించారు. నేర పరిశోధన సమయం లో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. శిక్షణలో 139 ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు.