Niranjan Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోపా పథకం అమలు చేయాలి. రైతులకు వెంటనే ఎకరానికి రూ. 7500 సాయం అందించాలి. ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా సీఎం, మంత్రులకు రైతు భరోసా అందించే తీరిక లేదా..? రుణమాఫీ అమలు చేస్తారా లేదా చెప్పాలి. ఐదు ఎకరాల లోపు రైతులకు ఏ బ్యాంక్ రూ. 2 లక్షలు లోన్ ఇవ్వలేదు. ఐదు ఎకరాల లోపు రైతులకు ఎంత మందికి రూ. 2 లక్షలు రుణాలిచ్చారో చెప్పాలి. రూ. 2 లక్షల రుణం తీసుకున్న రైతుల వివరాలు వెల్లడించాలి. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా..? లేదా..? రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తారా..? లేదా..? రేషన్ కార్డులు లేనివారికి కొత్తవి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో అన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. నిబంధనల పేరుతో రేషన్ కార్డుల్లో కోత పెట్టాలని కుట్రలు చేస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
రుణమాఫీకి కేబినెట్ ఆమోదించినందుకే సంబురాలు చేస్తున్నారు. సినిమావాళ్ల సోపతి వల్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారు. రుణమాఫీ చేసినట్టే సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు. కేసీఆర్ హయాంలో ఇలా చేస్తే కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెట్టాయి. ఆయా మీడియా సంస్థలు ఇప్పుడేం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి రుణమాఫీ అధికారంలో రాగానే డిసెంబర్ 9న చేస్తామని అన్నాడు.. అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15న చేస్తామన్నాడు. మొదట రుణమాఫీకి రూ. 40 వేల కోట్లు కావాలన్నాడు.. క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి రూ. 30 వేల కోట్లే అని అంటున్నాడు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది. అలు లేదు సులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 8 నెలలైనా ఇంకా రుణమాఫీ చేయలేదు కానీ అప్పుడే కేబినేట్లో రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నామని పాలాభిషేకాలు చేయించుకుంటున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు ఇస్తామని చెప్పారు. దేశంలోనే విద్యార్థి, యువతను ఇంత గొప్పగా ఎక్కడా మోసం చేయలేదు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టి నేటికి 50 ఏండ్లు అవుతుంది. చీకటి పాలన చేసినందుకు కాంగ్రెస్ సంబురాలు చేసుకోవాలి. దళితబంధు రూ. 10 లక్షలకు బదులు రూ. 15 లక్షలు ఇస్తామన్నారు. ఇంతవరకు దళితబంధు ఊసేలేదు. ఘనత వహించిన మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించవు..? దేశంలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైంది. మోదీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కకావికలం అయింది. మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా దేశం విభజన. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే దేశ ప్రజల్లో చీలిక ఏర్పడింది అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.