Jagadish Reddy | ప్రత్యేక రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్గఢ్తో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని మాజీ విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్కు ఆయన శనివారం లేఖ రాశారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం చెప్పానన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి రూ.3.90 విద్యుత్ కొన్నామన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్ను రూ. 17 కొంటున్న పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని.. సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారన్నారు. పీజీసీఎల్లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్నారు.
తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90 పైసలకు విద్యుత్ తీసుకున్నారన్నారు. కేసీఆర్పై నిందలు వేద్దామని ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణవుతున్నాయన్నారు. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. ప్రతి పవర్ ప్లాంట్ 10శాతం, విదేశీ బొగ్గును వాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టిందన్నారు.
సింగరేణి బొగ్గు ఉండడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తాము ఒప్పుకోలేదన్నారు. మేము కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందన్నారు. విద్యుత్ విచారణ కమీషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆరువేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం రాసుకోలేదన్నారు. కేసీఆర్, రమణ్సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు. విచారణ కమిషన్ సరిగా లేదని నేను లేఖ రాశానన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను విద్యుత్ విచారణ కమిషన్కు లేఖ రాశానన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఎక్కడైనా లంచం తీసుకునే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. లేఖ చూసిన తర్వాత విచారణ కమిషన్ చైర్మన్ మనసు మార్చుకుంటారని భావిస్తున్నామన్నారు.