Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సంక్షేమానికి సమాధి కట్టేశారు.. నిరుద్యోగులను నిలువునా ముంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు. ఒకటో తేదీన జీతాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మే, జూన్ మాసాలకు సంబంధించిన పెన్షన్లు ఇవ్వలేదు. పక్కనే సీఎం చంద్రబాబు పాత బకాయిలు కలిపి ఏడు వేల పెన్షన్ ఇచ్చిండు. రేవంత్ నెలకు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చేయలేదు. ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలల నుంచి ఇవ్వడం లేదు. అర్హులైన వారికి పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్రావు పేర్కొన్నారు.
ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. ఏడు నెలల కాలంలో ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కింద ప్రతి పల్లెకు జనాభా ప్రతిపాదన నిధులు ఇచ్చాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చాం. కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తుంది. ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఈ నెల 4న జిల్లాల పరిషత్ల పదవీకాలం ముగియనుంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.