Harish Rao | హైదరాబాద్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్(43) ఆత్మహత్యపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య దురదృష్టకరం.. ఆయన కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఒక రైతు వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మాటలు వింటే హృదయ విదారకంగా ఉన్నాయి. ఆయన కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూస్తుంటే చూసిన వారికి కూడా కన్నీళ్లు వస్తున్నాయి. ఆయన ఆత్మహత్య దురదృష్టకరం. ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. ప్రభాకర్ తన ఆత్మహత్య కంటే విడుదల చేసిన వీడియోనే.. మరణ వాంగ్మూలంగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈ ఘటనపై స్పందించాల్సిన పోలీసులు కూడా స్పందించట్లేదు.ఆయన తండ్రి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారు అని హరీశ్రావు తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. ప్రభాకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీనే కారణం. తన భూమిలోని మట్టిని జేసీబీ, ప్రొక్లెయిన్తో చెల్లాచెదురుగా చేశారని ఎస్ఐ, ఎమ్మార్వో, కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశానని ప్రభాకర్ చెప్పాడు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించి ఉంటే ఆయన బతికుండేవాడు. అంటే పాలన సరిగాలేదు. ఎక్కడా న్యాయం జరగలేదు. తనకు చావే దిక్కు అని ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ప్రతిపక్షం తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రభుత్వం తప్పు చేస్తే పోరాటం చేయడమే ప్రతిపక్షంగా మా బాధ్యత అని హరీశ్రావు స్పష్టం చేశారు.
ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా, వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలి. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్రావు పేర్కొన్నారు.