Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గత ఏడు నెలల నుంచి గ్రామపంచాయతీలకు ఏడు పైసలు కూడా విడుదల చేయలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం నిలిచిపోయింది. మలేరియా, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం గత సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి తెచ్చి పల్లెలను అద్దాల్లా మార్చారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించారు. గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత లక్ష్యంగా బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమంలో స్పెషల్ డ్రైవ్, మార్చి నెలలో మరో డ్రైవ్ చేసేవాళ్లం. దాంతో వైరల్ ఫీవర్స్ను అరికట్టగలిగాం.. అభివృద్ధి కూడా జరిగింది అని హరీశ్రావు తెలిపారు.
ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. ఏడు నెలల కాలంలో ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కింద ప్రతి పల్లెకు జనాభా ప్రతిపాదన నిధులు ఇచ్చాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చాం. కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసి నెలలు గడుస్తుంది. ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఈ నెల 4న జిల్లాల పరిషత్ల పదవీకాలం ముగియనుంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరచాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.