Harish Rao | హైదరాబాద్ : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ చేశారు. ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా..? అని హరీశ్రావు ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనా..? అని నిలదీశారు హరీశ్రావు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం అని హరీశ్రావు తేల్చిచెప్పారు.
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ సహా అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అభియోగాలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా పరిషత్ అధికారుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?
ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.?
కాంగ్రెస్ పాలనలో… pic.twitter.com/B0LweUkHN9
— Harish Rao Thanneeru (@BRSHarish) July 3, 2024