Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్రావు నిలదీశారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణకు కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,769 పంచాయతీల్లో 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది. కేంద్రం గ్రామపంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులు లేవు. తెలంగాణ పల్లెలు, మండలాలు, జిల్లాలు ఉత్తమంగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీలు కూనరిల్లుతున్నాయి. పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది. మురికి కూపాలుగా మారుతున్నాయి. డీజీల్ పోయించుకునే పరిస్థితి లేదు. ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఇది ఇవాళ పరిస్థితి. కొన్ని చోట్ల పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి డిజీల్ పోయిస్తున్నారు. నా నియోజకవర్గానికి నిన్న వెళ్లాను.. స్పష్టంగా అధికారులతో మాట్లాడిన తర్వాతనే మాట్లాడుతున్నాను. కరెంట్ బిల్లులు కట్టేందుకు కూడా గ్రామపంచాయతీల వద్ద డబ్బుల్లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ బిల్లులు సయమానికి కట్టేవారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు డబ్బులు, పారిశుధ్య కార్మికులు వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు పాలనా అస్తవ్యస్తంగా తయారైంది అని హరీశ్రావు మండిపడ్డారు.
పంచాయతీల్లో డబ్బుల్లేక చెత్త పేరుకుపోయింది. స్పెషల్ డ్రైవ్ లేదు. ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులకు స్థానం లేదా..? ఒకటో తారీఖున జీతాలు ఇవ్వారా..? అంటురోగాల బారిన పడితే ఎలా..? పల్లెల మీద సమీక్ష ఎందుకు చేయట్లేదు. చివరకు సర్పంచ్లు పోయి గవర్నర్కు మొర పెట్టుకునే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. వేతనాలు అందక కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ నీళ్లల్లో కలపాలి. గడ్డి మందు లేదు. అస్తవ్యస్తం అయిపోయింది ప్రజా పాలన. పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు అని హరీశ్రావు నిలదీశారు.