Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి పెట్టండి అంటూ ఆయన కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. నాగర్కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మా ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, మర్రి రిటైల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలల వద్ద మా ట్రస్ట్, కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యవహారంపై అధికారులను నిలదీయగా.. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయా పాఠశాలలపై పేర్లు తొలగించినట్లు అధికారులు నాకు చెప్పారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కానీ నా ట్రస్ట్ ద్వారా చేపట్టిన అభివృద్ధిని చెరిపేయాలని అధికారం ఇవ్వలేదు. ఈ ఆరు నెలల కాలంలో మీరు చేసిన అభివృద్ది ఏం లేదు. కేవలం నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మీరు రిబ్బన్ కటింగ్స్ చేస్తున్నారు. గోడలపై ఉన్న నా ట్రస్ట్ పేర్లు మాత్రమే మీరు తొలగించగలరు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మర్రి పేరును మాత్రం తొలగించలేరు.. గుర్తు పెట్టుకోవాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేను మర్రి జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.
మీ రాజకీయ చరిత్రలో మీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డాను. నాగర్కర్నూల్ నియోజకవర్గం ప్రాంత వాసుల చిరకాల కోరికలను నెరవేర్చాను. విద్యార్థుల భవిష్యత్ కోసం శాశ్వత స్కూల్ బిల్డింగ్స్ను నిర్మించాను. వైద్య సేవలు మెరుగుపరిచాను. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో నిర్మాణాత్మక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లాను సాధించాను. మెడికల్ కాలేజీ తీసుకొచ్చాను. రైతులకు సాగునీటి ప్రాజెక్టులు సాధించాను. మొత్తంగా నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేశాను. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా నా పేరు పెట్టుకోలేదు. మీ నాన్న జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై పేరు రాయించుకున్నారు. యెనకటికి తాడూర్లో లక్షకో, రెండు లక్షలకో ఎకర భూమి కొని, దాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వ నిధులతో జూనియర్ కళాశాల నిర్మించి ఆ కళాశాలకు మీ అమ్మ పేరు కుచుకుల్ల సౌభాగ్యవతి అని పేరు పెట్టుకున్నారు. తూడుకుర్తిలో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కి భూమి ఇచ్చి దానికి కూడా పేరు రాయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో జీఎస్డీపీ ప్రభుత్వ నిధులతో మంజూరైన బెంచీలపై మీ పేరు రాయించుకున్నారు. ప్రభుత్వ నిధులతో నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథంపై మీ పేరు రాయించుకున్నారు. ప్రభుత్వ నిధులతో అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో మంజూరు చేసిన కమ్యూనిటీ హాళ్లకు, బస్టాండ్లకు, పీర్ల చావిడిలకు, కాంపౌండ్ వాల్స్కు మీ పేరు రాయించుకున్నరు. ఈ రోజు మీరు నా ట్రస్ట్ పేరు తొలగించినట్టు ఆ రోజు నేను మీ పేర్లు తొలగిస్తే మీ ఆనవాళ్లు లేకుండా పోతుండే. కానీ నేను కేవలం నాగర్కర్నూల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పూర్తి దృష్టి పెట్టాను అంతే. నేను కేవలం నా ట్రస్ట్, నా కంపెనీ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై మాత్రమే మా ట్రస్ట్ పేరును పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పాఠశాలలపై మా ట్రస్ట్ పేరు రాసుకున్నామని మీరు అన్నమాట నూటికి నూరుపాళ్ళు అవాస్తవం. ఒకవేళ ప్రభుత్వ నిధులతో నిర్మించిన స్కూళ్లపై నా పేరు రాసుకోవాలనుకుంటే తిమ్మాజిపేట మండలంలోని మరికల్, ఎదిరేపల్లి స్కూళ్లపైన నా పేరు బ్రహ్మాండంగా రాపించుకునే వాడిని. కానీ నేను మీ లాగా నా పేరు రాయించుకోలేదు అని మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
సాక్షాత్తు ప్రభుత్వం జీవోనే ఉంది. ఎవరైనా తమ సంస్థ లేదా వారు స్వంతంగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాజాప్త ఆ కార్యక్రమాలపై తమ పేరు, తమ సంస్థ పేరు రాసుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మా ట్రస్టు, మా కంపెనీ ద్వారా నిర్మించిన పాఠశాలలపై మా కంపెనీ, ట్రస్ట్ పేరు రాసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో భాగ్యస్వామిగా ఉన్న నువ్వు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను గౌరవించకుంటే ఎలా..? అని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు.
మీకు నిజంగా సేవా గుణం ఉంటే.. నా లాగా స్కూల్స్ కట్టించండి. సామూహిక వివాహాలు చేయండి. 1 రూపాయికే భోజనం క్యాంటీన్ పెట్టండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి. ప్రజలు మెచ్చుకుంటారు. గత ఎన్నికల్లో ప్రజలకు 420 అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానని ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఒక ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీ నెరవేర్చలేదు. డిసెంబర్ 9వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు ఈరోజు వరకు చేయలేదు. రైతులకు రైతు భరోసా లేదు. పుట్టిన పిల్లల నుండి చనిపోయే ముసలవ్వల వరకు అందర్నీ మోసం చేశారు.
నియోజకవర్గ ప్రజలు సమస్యలపై మిమ్మల్ని కలవడానికి వస్తే తండ్రి కొడుకులు కలిసి దాగుడుమూతల ఆట ఆడుతున్నారు. నీ గెలుపు కోసం పనిచేసిన మీ నాయకులు, కార్యకర్తలే మీ గెలుపు తర్వాత మీ వ్యవహార శైలిపై బహిరంగంగా మండిపడుతున్నారు. మీరు గెలిచిన ఏడు నెలల్లోనే ఇసుక మాఫియా ద్వారా కోట్లు సంపాదించారు, అక్రమ వసూళ్లపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో మా కార్యకర్తలను వేధిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. ఎవరు ప్రజల కోసం పనిచేశారో.. ఎవరు సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో గమనిస్తున్నారు. ఇకనైనా ఈ దుర్మార్గ పనులు మానుకొని ప్రజలకు మంచి చేయాలని, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నానని మర్రి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.