హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నడుస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఆధిత్యనాథ్దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించారని విమర్శించారు.
ఈ నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు.
తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ నాడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బంద్ పాటించిందని, కానీ, రేవంత్రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు. రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నవిధంగా ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. భద్రాచలం రూరల్ మండలంలోని ఏటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్రెడ్డి కృషి చేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్పై కమిషన్లను నియమిస్తూ, కాంగ్రెస్ మంత్రులు మాత్రం కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కిషన్రెడ్డి చొరవ తీసుకొని సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఆ కుంభకోణంలో సీఎంకు పాత్ర: పెద్ది సుదర్శన్రెడ్డి
సివిల్ సైప్లె కుంభకోణంలో సీఎం రేవంత్రెడ్డి పాత్ర ఉన్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. దీనిపై త్వరలోనే సివిల్ సైప్లె భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ధాన్యం, బియ్యం కొనుగోళ్లలో సీఎం రేవంత్రెడ్డికి వాటాలు లేకుంటే దానిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.
రేవంత్రెడ్డి పౌరసరఫరాల శాఖపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు మరో రెండు నెలల గడువు పెంచినట్టుగా సమాచారం ఉన్నదని, ఆ వివరాలను బయటికి రానివ్వడంలేదని, మీడియాను కూడా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలోకి అనుమతించడంలేదని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్యాదవ్, సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.