హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ‘కాంట్రిబ్యూటరీ పెన్షనరీ స్కీం (సీపీఎస్)ను రద్దుచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకుపడలేదు. కమిటీలు, కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలి. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను త్వరగా తెప్పించుకుని, ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలి. అన్ని శాఖలవారికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఏ పోరాటాలకైనా సిద్ధం’ అని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రకటించారు.
ఉద్యోగులపై కొంతకాలంగా అనేకదాడులు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టంచేశారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా ఇటీవలే నియమితులైన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది, రాజకీయనాయకులను రక్షణ కల్పిస్తున్నది ఉద్యోగులేనని, ఈ ప్రభుత్వం ఉద్యోగుల మేలు కోరేదైతే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు అభివృద్ధి ప్రదాతలని, అభివృద్ధిలో భాగమని, వారిపాత్ర, కృషిలేనిదే ఏ పథకం కూడా విజయవంతంకాదని చెప్పిన ఆయన, మరిన్ని విషయాలను ఇలా పంచుకున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది. 90 రోజులు పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని మేం ఓపికపట్టినం. సమస్యల పరిష్కారం కోసం నాలుగైదు సార్లు సీఎం రేవంత్రెడ్డిని కలిసినం. పరిష్కరిస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డే హామీనిచ్చారు. చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. కొన్ని హామీలు ఇంకా నెరవేర్చలేదు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన రాబోయే పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాం. జిల్లాలవారీగా సమస్యల పరిష్కార సభలు నిర్వహిస్తాం. సీపీఎస్ రద్దు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, మార్కెటింగ్ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. ఆ తర్వాత అన్ని సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. కొందరు ఉద్యోగులపై అక్రమాస్తులు కలిగి ఉన్నారని దాడులు చేయడం, ఏసీబీ కేసులు పెట్టడం సమంజసం కాదు. దీన్ని మేం ఖండిస్తున్నాం.
ఒకటో తేదీన జీతాలిస్తున్నా పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడంతో అందరిలోనూ అసంతృప్తి నెలకొన్నది. ధరల సూచీ ప్రకారం ఎప్పటికప్పుడు ప్రభుత్వమే విధిగా డీఏ విడుదలచేయాలి. ఎన్నికల సమయంలో ఒక డీఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. ఈ జూలైతో కలిపితే మొత్తం 5 డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీపడింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. వీటిలో నాలుగు డీఏలను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయాలి. జీపీఎఫ్ సహా భవిష్యనిధిపై అంక్షలు, పరిమితులను ప్రభుత్వం తొలగించాలి. మా విజ్ఞప్తుల కారణంగా లక్ష లోపున్న బిల్లులు చెల్లించారు. పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు ఇవ్వాలి. పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకొని, 51శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలి. అందరికీ 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలి.
సాధారణ బదిలీలు చేపట్టడం హర్షణీయమే కానీ, జీవో 317కు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలున్నాయి. పరస్పర, స్పౌజ్ బదిలీలు కోరుతున్న వారున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా సాధారణ బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. ఇక ఎన్నికల సమయంలో పలు శాఖల ఉద్యోగులు, అధికారులను బదిలీచేశారు. వారిని ఇంకా వెనక్కి తేలేదు. ఎన్నికలు పూర్తికాగానే వెనక్కి తీసుకురావడం సంప్రదాయం. తక్షణమే వారిని సొంత స్థానాలకు బదిలీ చేయాలి. రిటైర్డ్ అయిన వారిని కొనసాగించడం దారుణం. దీనివల్ల ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం పడుతున్నది. 30 ఏండ్ల సర్వీసు దాటినా పదోన్నతులు లభించని పరిస్థితులున్నాయి. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపును ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోం.
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య చికిత్స కోసం గత ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం) ట్రస్టు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తలా రూ. 500 చొప్పున సమకూర్చేందుకు అప్పట్లో జీవో జారీచేసింది. సరిపోకపోతే మరికొంత సమకూర్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. బీమా సంస్థలు, ప్రైవేట్ దవాఖానలు సైతం ఈహెచ్ఎస్ అమలుకు ముందుకొచ్చాయి. మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం ఏటా రూ. 700 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నది. దీంతో పోలిస్తే ఈహెచ్ఎస్తో భారం తక్కువ, ప్రయోజనాలెక్కువ. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ స్కీంను అమలుచేయాలి. ఉద్యోగులందరికీ హెల్త్కార్డులిచ్చి నగదురహిత, అపరిమిత వైద్యం అందించాలి.
రాష్ట్రంలోని 40శాతం ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. వీరికి జీవనభద్రత కరువైంది. పెన్షన్ హక్కులు పూర్తిగా హరించుకుపోయాయి. సీపీఎస్ను రద్దుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. సీపీఎస్ రద్దుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించి కేంద్రానికి పంపాలి. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యభూమిక పోషించాలి. ఇదే అంశంపై జేఏసీ తరఫున కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేసినం. ఇప్పటి వరకు మరే ఉద్యోగం సంఘం కూడా సీపీఎస్ను రద్దుచేయాలని కోరలేదని నిర్మలా సీతారామన్ మాతో అన్నారు. సీపీఎస్పైనా తాము కమిటీని వేశామని, రాష్ర్టాల సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వెంటనే నిర్ణయం తీసుకొని కేంద్రానికి విన్నవించాలి.