Gangadhara | గంగాధర, జూలై 8: కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది! ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా.. ఇది చూసిన మరో ఇద్దరు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు.
పాఠశాల సిబ్బంది, విద్యార్థుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధరలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదే సమయంలో పాఠశాలపై నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్తు తీగలు తెగి ఇద్దరు విద్యార్థులపై పడ్డాయి.
ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఓ అశ్విత్ నడుము, చేతులపై, 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏ అశ్విత్కు కాలిపై గాయాలయ్యాయి. కింద పడిపోయిన విద్యార్థులను చూసి మరో ఇద్దరు విద్యార్థులు భయంతో సృహతప్పి పడిపోయారు. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం కరీంనగర్ సర్కారు దవాఖానకు తరలించారు. స్పృహతప్పిన విద్యార్థులకు స్థానిక పీహెచ్సీలో చికిత్స చేయించారు.
విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ సరిత తెలిపారు. తీగలు తెగిపడిన సమయంలో కరెంటు సరఫరా లేనందున పెను ప్రమాదం తప్పిందని సిబ్బంది తెలిపారు. విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల సమీపంలో కోతులు ఎక్కువగా ఉండటం, అవి తీగలపై దుంకడంతో రెండు వైర్లు ఒకదానికొకటి తాకి తెగిపడ్డాయని తెలిపారు. పాఠశాల మైదానంపై నుంచి వెళ్తున్నాయని విద్యుత్ వైర్లను తరలించడానికి రెండేండ్ల క్రితమే రూ.90 వేలు డీడీ కట్టినట్టు భవన యజమాని రుద్రాక్ష అనిల్ చెప్పాడు. ఇప్పుడు ఆ డీడీ ల్యాప్స్ అయ్యిందని, మరోసారి డీడీ కట్టాలని అధికారులు చెప్పారని అనిల్ తెలిపాడు.