హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చి మాట మా ర్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు కుతకుతలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమబాట పట్టారు. ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు, టీజీపీఎస్సీ ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్కు ఎంపిక చేయాలని, గ్రూప్-2, గ్రూప్3, డీఎస్సీలో ఖాళీల సంఖ్య పెంచాలని, జీవో 46 రద్దు, గు రుకులాల్లో రీలింక్విష్మెంట్ అమలుకు రెండు రోజులుగా గాంధీ దవాఖానలో నిరుద్యోగి మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
మద్దతుగా వేలాది మంది నిరుద్యోగులు ముందుకొస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నయవంచనకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ… వికారాబాద్లో దిష్టిబొమ్మను నిరుద్యోగులు దహనం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిన కాంగ్రెస్ వైఖరి పట్ల సాహిత్యకారులు నిరసన వ్యక్తంచేస్తూ నిరుద్యోగుల ఉద్యమాలకు అండ గా నిలుస్తున్నట్టు తెలిసింది. కళాకారులు పాటల రూపంలో వ్యతిరేక గళం వినిపిస్తున్నా రు. పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, రాజకీయ పార్టీలు నేతలు కూడా నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నారు. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించిన నిరుద్యోగుల అంశమే, తిరిగి ఆ పార్టీని వెక్కిరిస్తుంది. అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించాలి అ ని నిరుద్యోగులు భావించే పరిస్థితి వచ్చింది’ అని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన విధం గా జాబ్ క్యాలండర్ ఎందుకు విడుదల చేయ డం లేదని ప్రశ్నించారు. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని నిలదీశారు.
నిరుద్యోగుల డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ చైర్మన్, ఓయూ జేఏసీ నేత మోతీలాల్నాయక్ చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్నాయక్ నిరాహార దీక్ష చేపట్టిన క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, ఓయూ పోలీస్స్టేషన్కు తరలించారు. మోతీలాల్ పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగిస్తుండటంతో పోలీసులు అతడిని గాంధీ దవాఖానకు తరలించారు. దవాఖానలో ఉన్న ఆయనను పలువురు విద్యార్థి, నిరుద్యోగ నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య డిమాండ్ చేశారు.