హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులను వంచించి రూ.వందల కోట్లు వసూలు చేసిన సైబర్క్రైమ్ ముఠా వివరాలను తెలంగాణ పోలీసులు ఇండియన్ సైబర్క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా అన్ని రాష్ర్టాలకు చేరవేస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను సంప్రదించి వివరాలు తెలుసుకున్నది. చైనీయులు వెనుకుండి నడిపిస్తున్న ఈ దందాపై హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు లోతైన దర్యాప్తు జరపడంతో రూ.712 కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 1,500 ఫిర్యాదులు వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చైనాకు చెందిన లీ అనే మహిళతోపాటు మరికొందరిని ఈ స్కామ్ సూత్రధారులుగా భావిస్తున్న పోలీసులు.. ఆ ముఠా వివరాలను అన్ని రాష్ర్టాలకు పంపి అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
ప్రకాశ్ ప్రజాప్రతి పాత నేరస్థుడే
ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న అహ్మదాబాద్ (గుజరాత్) వాసి ప్రకాశ్ ప్రజాపతి పాత నేరస్థుడే. భారత్లో నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంక్ ఖాతాలను తెరిచి, కమిషన్ కోసం వాటిని విక్రయించే వారికి, చైనీయులకు మధ్య ఏజెంట్గా వ్యవహరిస్తున్న ప్రజాపతి నిరుడే హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటంతో జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను గుజరాత్, ఢిల్లీని అడ్డాగా చేసుకొని చైనీయులతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని భారీ సంఖ్యలో నకిలీ బ్యాంక్ ఖాతాలను తెరిచినట్టు పోలీసులు గుర్తించారు.
నిందితుల కస్టడీతో మరింత సమాచారం
ఇటీవల అరెస్టయిన ఈ ముఠా సభ్యులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం కోర్టును కోరింది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వారిని పోలీసుల కస్టడీకి అప్పగిస్తే మరిన్ని బ్యాంక్ ఖాతాల వివరాలతోపాటు చైనీయకులకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.