శంషాబాద్ రూరల్, జాన్ 29: శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో తనిఖీ చేయగా అతడి బ్యాగులో ప్లాస్టిక్ సపోర్టు షీట్లలో యూఎస్ డాలర్లు (67,11, 250 రూపాయల విలువైన) స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బోడుప్పల్ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం
బోడుప్పల్, జూన్29: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్పై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. శనివారం కీసర ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి 28 మంది కార్పొరేటర్లకు 22 మంది మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్పార్టీ అభ్యర్ధి తోటకూర అజయ్యాదవ్ మేయర్గా ఎన్నికవడం లాంఛనం కానుంది. డిప్యూటీ మేయర్ ఎంపికపై సందిగ్ధత నెలకొంది.
గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ విభాగాల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పురోగతిని కమిషన్కు వివరించారు.
ఎక్సైజ్శాఖపై ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ శనివారం ఆబ్కారీ భవన్లో సమీక్షించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు తమ విభాగాల పనితీరు, ఆదాయం, ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేషన్ పనితీరుపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు, కమీషన్లు తదితర వాటిపై చర్చించినట్టు తెలిసింది.
ఏపీలో రేపు 90 శాతం మందికి పింఛన్ల పంపిణీ
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 65 లక్షల పింఛనుదారులకు జూలై ఒకటినే ఫించన్లు పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనికి అవసరమైన రూ. 4,399 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ఎన్ఐఎన్ పోషకాల యాప్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆహారంలో ఉండే పోషకాలపై సమగ్ర, శాస్త్రీయ అవగాహన కల్పించేలా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘న్యూట్రి ఇండియా నౌ’ అనే ఈ మొబైల్ యాప్ ద్వారా నేరుగా పోషకాహారంపై అవగాహన పెంచుకోవచ్చని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ నిర్దేశించిన కచ్చితమైన పోషకాహార గణాంకాల ఆధారంగా యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.