DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేషన్స్కు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. జులై 2వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక జులై 3 నుంచి 4 సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. మొత్తం మూడు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతామని అధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే ఫేజ్-1, 2 దశలు అయిపోయాయి. ఇక మిగిలింది ఈ దశనే.
రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 4,49,449 సీట్లున్నాయి. వీటిలో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 86 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలున్నాయి. నిరుడు 3,89,049 సీట్లుంటే 2.05లక్షల సీట్లు నిండాయి. ఈ ఏడాది నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రవేశపెట్టిన సెక్టార్ స్కిల్ కోర్సులను పలు కాలేజీల్లో విస్తరించారు. ఈ ఏడాది జూలై 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.