Minister Komatireddy | నల్లగొండ, జూలై 1: నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బీఆర్ఎస్ కార్యాలయంపై అక్కసును వెల్లగక్కిన ఆయన.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సోమవారం పట్టణంలోని సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘నల్లగొండలో ప్రభుత్వభూమి స్వాధీనం చేసుకొని బీఆర్ఎస్ ఆఫీస్ను అనుమతి లేకుండా కట్టారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా నిర్మిస్తే ఎలా? దాన్ని వెంటనే కూల్చేయండి’ అని కలెక్టర్ నారాయణరెడ్డికి ఆవేశంగా సూచనలు చేశారు.
‘కమిషనర్ ఎక్కడ ఉన్నావ్.. దీనికి అనుమతి ఉన్నదా? లేకుంటే కూల్చేయాలి కదా!’ అనడంతో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ స్పందిస్తూ ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చామని, రిైప్లె రాలేదని బదులిచ్చారు. దాంతో మరో రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చి కూల్చేయాలని కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కలెక్టర్కు చెప్తూ ‘నోటీసులు ఇవ్వండి.. ఇది పద్ధతి కాదు కదా.. అనుమతి లేకుండా ఎలా కడతారు? రూ.వంద కోట్ల ఆస్తి అది. వెంటనే యాక్షన్ తీసుకోండి. మినిస్టర్ చెప్తే గవర్నమెంట్ చెప్పినట్టే లెక్క. నీ డ్యూటీ నువ్వు చెయ్యు’ అని వ్యాఖ్యానించారు. ‘వాళ్లకు(బీఆర్ఎస్) భూమి కావాలంటే ఊరి బయట ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి కదా.. అక్కడ దరఖాస్తు చేసుకొంటే ఇస్తాం.. అక్కడ కట్టుకొమ్మని చెప్పండి ఆఫీస్ను’ అని అన్నారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే..
నల్లగొండ నడిబొడ్డున ఇతర రాజకీయ పార్టీలు గతంలోనే ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోనే జిల్లా పార్టీ కార్యాలయ భవనాలను నిర్మించుకున్నాయి. కాంగ్రెస్తో పాటు బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐకి ఏండ్ల తరబడి సొంత కార్యాలయ భవనాలు ఉన్నాయి. ఒక్క బీఆర్ఎస్ పార్టీకే సొంత కార్యాలయం లేదు. దీంతో జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్ రోడ్డు లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించాలని అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అప్పటి అధికారులు బీఆర్ఎస్ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించి స్వాధీనపరిచారు.
నిబంధనల ప్రకారమే..
బీఆర్ఎస్ పార్టీకి నిబంధనల ప్రకారమే అప్పటి ప్రభుత్వం నల్లగొండలో బీఆర్ఎస్ కా ర్యాలయానికి అధికారికంగా స్థలాన్ని కేటాయించింది. ఇలా కేటాయించిన స్థలంలోనే బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణం చేపట్టాం. 2019లోనే నిబంధనల ప్రకారం కలెక్టర్కు దరఖాస్తు చేస్తే, ఆయన నుంచి ఆర్డీవో.. ఆ తర్వాత తాసీల్దార్ పంచానామా అనంతరమే భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఇతర పార్టీల కార్యాలయాల మాదిరిగానే ఇక్కడ నిర్మాణం చేపట్టాం. పార్టీ ఆఫీస్ నిర్మాణం ఇంకా చివరి దశలోనే ఉన్నది.
– కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ