కృష్ణ కాలనీ, జూన్ 26 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను(Coal mines) వేలం వేయడాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా(Dharna) చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమితి సభ్యుడు మోటపలుకుల రమేశ్, భూపాలపల్లి (Bhupalapalli) పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధి కారంలోకి రాగానే 60 సింగరేణి బ్లాకులను వేలం వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడం వల్ల అనేకమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సింగరేణికి నూతన గనులు రాకుంటే 5 సంవత్సరాల్లోనే మూతపడే ప్రమాదం పొంచి ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన గనులకు పర్మిషన్ ఇచ్చి బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బొగ్గు గనుల వేలాన్ని విరమించుకోకుంటే రాబోయే రోజుల్లో సిపిఐ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మకు అందించారు.