Deputy CM Bhatti | హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తామని, ఆ సంపదను ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ… అప్పులు కట్టేందుకు అప్పులు చేస్తున్నారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ… ‘అప్పు చేసి అప్పు కడతామా లేక అప్పు చేసి ఆస్తులు సృష్టిస్తామా అనేది భవిష్యత్తులో మీరే చూస్తారు.
మా ప్రభుత్వం అప్పులు తెస్తుంది.. అభివృద్ధి చేస్తుంది’ అని స్పష్టంచేశారు. రుణమాఫీపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ పనిలో నిమగ్నమైందని తెలిపారు. రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని, అందరి ఆలోచనల మేరకు అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా బృందాలకు ఏడాదికి రూ. 20వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు.
దేశ సంపదను జనాభా దామాషా ప్రకారం పంచాలని, ఇలా చేయడం వల్ల కొంతమందికి దేశ సంపదను పంచుతున్న బీజేపీ చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడ్డారు. పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆయన స్పందిస్తూ… ఇది పూర్తిగా అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. దేశంలో అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇక్కడ పెట్టుబడులకు సహకరించాలని,అన్ని రంగాల వారికి విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరినట్టు తెలిపారు.
జగదీశ్రెడ్డి సూచన మేరకే కమిషన్
విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ మేరకే జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో తాము శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని సూచించిన మేరకే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇది తమకు తాముగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కాదని భట్టి స్పష్టం చేశారు.
కష్టపడిన వారికే పదవులు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికే పదవులు దక్కుతాయని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పార్టీలో ఎవరు పని చేస్తున్నారనే అంశంపై అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉందని అన్నారు.