హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ఇతర రాష్ర్టాల్లోని నమూనాలపై అధ్యయనం చేయించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏదాది ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య రెవెన్యూ శాఖ నుంచి భూమిని సేకరించుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లలో సోలార్ విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి ఆయన ప్రశ్నించడంతో.. జీహెచ్ఎంసీ పరిధిలో 69 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారని, మరో 31 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.
అనంతరం గృహనిర్మాణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4,16,500 ఇండ్లు, రిజర్వ్ కోట కింద మరో 33,500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.22,500 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమారను కోరినట్టు చెప్పారు. సమావేశంలో గృహనిర్మిణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు.