Dengue | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నది.. ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావొచ్చు.. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నట్టు వెల్లడించింది. డెంగ్యూలోని నాలుగు ప్రధాన వేరియంట్లు డీఈఎన్వీ-1, డీఈఎన్వీ-2, డీఈఎన్వీ-3, డీఈఎన్వీ-4 తెలంగాణలో కనిపిస్తున్నాయని తెలిపింది.
ఇందులో రెండు, మూడు వేరియంట్లు ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. దవాఖానల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, వైద్యారోగ్యశాఖ గానీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించటం లేదు. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలు చేపట్టడంతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
కానీ ప్రభుత్వం పారిశుద్ధ్యంపైగానీ, దోమల నివారణపైగానీ, దవాఖానల బలోపేతంపైగానీ దృష్టిపెట్టలేదు. కేవలం వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యికిపైగా కేసులు నమోదైనట్టు సమాచారం.
‘స్పెషల్ డ్రైవ్’ ఊసేలేదు
డెంగ్యూతోపాటు టైఫాయిడ్, మలేరియా వంటి దోమకాటు నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం మొదలయ్యే సమయంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఏటా జూన్లో గ్రామాలు, పట్టణాల్లోని మురుగు కాలువలను శుభ్రం చేయటం, వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని తొలగించటం, చెట్లు, పొదలను తీసేయటం, పాడైపోయిన, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలిగించటం లాంటి కార్యక్రమాలు నిర్వహించింది.
ఇందుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. దాంతో సత్ఫలితాలు వచ్చాయి. దోమల నియంత్రణ ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా తగ్గాయి. ఉదాహరణకు.. 2019లో దాదాపు 13 వేల డెంగ్యూ కేసులు నమోదు కాగా, 2020లో 2,173 కేసులు, 2021లో 7,135 కేసులు, 2022లో 8,972 కేసులు, 2023లో దాదాపు 5 వేల కేసులు నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం ఈ ఏడాది స్పెషల్ డ్రైవ్ను నిర్వహించటం లేదు. మరోవైపు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పర్యవేక్షణ లోపం కారణంగా పారిశుద్ధ్యం లోపించింది. దవాఖానల్లోనూ డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సరిపడా కిట్లు లేవని సమాచారం.
వైద్య పరీక్షలే కీలకం
డెంగ్యూ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకమని వైద్యులు చెప్తున్నారు. ప్లేట్లెట్ కౌంట్, డెంగ్యూ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్తోపాటు ఐజీఎం పరీక్ష కూడా చేయించాలని స్పష్టం చేస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులకు 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి 50 వేల వరకు తగ్గినా ఇబ్బంది లేదని నిపుణులు చెప్తున్నారు. ప్లేట్లెట్ల సంఖ్య 20 వేల కంటే దిగువకు పడిపోతే ప్రమాదకరమని, 15 వేల కన్నా తగ్గితే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ దవాఖానలు ప్రజలను దోచుకుంటాయని, ప్లేట్లెట్ల సంఖ్య కొంత తగ్గినా ఐసీయూలో చికిత్స అంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు ప్రైవేట్ దవాఖానలను నియంత్రించాలని కోరుతున్నారు.
జాగ్రత్తలు అవసరం
దోమల నియంత్రణ, వ్యాధుల నివారణకు ప్రభుత్వంతోపాటు ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని, ప్రతి వారం డ్రై డే పాటించాలని సూచిస్తున్నారు. రాత్రితోపాటు పగటిపూట కూడా దోమ లు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా స్కూళ్లలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.
డెంగ్యూ లక్షణాలు