TVVP | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)నుడైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చే నిర్ణయం కోసం సిబ్బంది కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రతిసారి ‘త్వరలో’ అంటూ హామీ ఇస్తున్నారే తప్ప అమలు కావడం లేదని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్తును టీడీపీ ప్రభుత్వం 1987లో ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ సంస్థగా కాకుండా.. ప్రభుత్వ గ్రాంట్తో నడిచే సంస్థగా ఏర్పాటు చేసింది.
పేస్కేలు, ఇతర ప్రయోజనాలన్నీ వైద్యారోగ్య శాఖలోని ఇతర ఉద్యోగులతో సమానంగా అమలవుతున్నా, జీతాలు మాత్రం ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసిన తర్వాతే వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద జీతాలు అందుతాయని, కానీ తాము ప్రతి నెల జీతభత్యాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గ్రాంట్ విడుదల చేసిన తర్వాతనే వేతనాలు వస్తున్నాయని, మిగతా ఉద్యోగుల కన్నా రెండు వారాలు ఆలస్యంగా అందుతున్నాయని వాపోతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టీవీవీపీని డీఎస్హెచ్గా మార్చే ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి.. తుది దశకు తీసుకొచ్చింది. నిరుడు సెప్టెంబర్ 22న ప్రత్యేకంగా కమిటీని నియమించింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ చైర్మన్గా, డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏపీలో ఏపీవీవీపీని డీసీహెచ్గా ఎలా మార్చారో అధ్యయనం చేసింది. ఇతర రాష్ర్టాల్లోని విధానాలను పరిశీలించింది. టీవీవీపీని డీసీహెచ్గా మార్చేందుకు సూచనలు చేస్తూ డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
కమిటీ నివేదిక ఇచ్చి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. టీవీవీపీని డీఎస్హెచ్గా మార్చితే ప్రభుత్వంపై రూపాయి కూడా అదనపు భారం పడదని ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న సిబ్బందితోనే ఎస్డీహెచ్ పరిపాలన సాగుతుందని, టీవీవీపీకి కమిషనర్ స్థానంలో డీఎస్హెచ్ డైరెక్టర్ వస్తారని అంటున్నారు. జీతభత్యాలు మారవని, తోటమాలి, ఫోన్ ఆపరేటర్ వంటి పోస్టులను తొలిగించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డీసీహెచ్ ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని, అసెంబ్లీలో బిల్లు పెట్టి తమను ప్రభుత్వ ఉద్యోగులగా మార్చాలని కోరుతున్నారు.