Gurukula Schools | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా, కనీసం మాటమాత్రమైన చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడంపై సంఘాలు భగ్గుమంటున్నాయి. కామన్ టైంటేబుల్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నా యి. ఇప్పటివరకు ఆయా సొసైటీల్లో పనివేళలు, రోజువారీ సమయపాలన పట్టికలు దేనికవే అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా అన్ని గురుకులాలకు కామన్ టైంటేబుల్ను నిర్ణయిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని సొసైటీలు 8గంటల నుంచి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
అన్ని గురుకులాలకు కలిపి ఒకే విధమైన పనివేళలను నిర్ణయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సం ఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్స్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్ సెక్రటరీ మధుసూదన్, తెలంగాణ గురుకుల స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్, ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు రుషికేష్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశా రు. ప్రభుత్వం నిర్ణయించిన పనివేళల్లో హేతుబద్దత, శాస్త్రీయత లేదని, ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయంకాదని వ్యతిరేకించారు. ప్రభు త్వ నిర్ణయం గురుకుల ఉపాధ్యాయులపై దాడి గా అభివర్ణించారు. 33వేల మంది గురుకుల ఉపాధ్యాయుల చేతిలో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యముందని, తాజా షెడ్యూల్ను అమలు చేస్తే అది విద్యార్థులకే తీరని నష్టమని హెచ్చరించారు. వెంటనే పనివేళల షెడ్యూల్ను ఉపసంహరించుకోవాలని ఆయా సంఘాలు డిమాండ్ చేశాయి.
గురుకులాల పనివేళల మార్పుపై దృష్టి సారించిన ప్రభుత్వం అదే సమయంలో ఆయా గురుకులాల్లో ఉన్న సర్వీస్రూల్స్ మార్పుపైనా దృష్టిపెట్టాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) అధ్యక్షుడు అజయ్కుమార్ డిమాండ్ చేశారు. పనివేళల మార్పుతో గురుకుల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని వివరించారు. కానీ ఒక్కో గురుకులానికి సంబంధించి ఒక్కో విధమైన సిబ్బంది సర్వీస్ రూల్స్ ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 5 గురుకుల సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ అవుతున్నా విభిన్నమైన సర్వీస్రూల్స్ వల్ల వారు బదిలీలు, ప్రమోషన్లలో తద్వారా జీతభత్యాల్లో తీవ్ర వ్యత్యాసముంటుందని వివరించారు. ప్రస్తుతం బదిలీలు, ప్రమోషన్లు చేపడుతున్న నేపథ్యంలో వెంటనే సర్వీస్రూల్స్ను కూడా మార్చాలని టీజీపీఏ అధ్యక్షుడు అజయ్కుమార్ డిమాండ్ చేశారు.