Telangana Bhavan | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ భవన్ను ‘ప్రైవేటు’కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో బహుళ అంతస్థులతో నిర్మించనున్న తెలంగాణ భవన్లో వాణిజ్య కార్యకలాపాల ను అనుమతించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు డెవలపర్కు అప్పగించాలని భావిస్తున్నట్టు ఉన్నతస్థాయివర్గాల ద్వారా తెలిసింది.
రాష్ట్ర అవసరాలకు కావాల్సినన్ని గదులు రాష్ర్టానికి ఇచ్చి మిగిలినదాంట్లో వాణిజ్య కార్యకలాపా లు నిర్వహించుకునేలా అనుమతించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భా గంగా స్టార్ హోటళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉండాల్సిన తెలంగాణ భవన్ ఏదో ఒక స్టార్ హోటల్ పేరుతో పిలుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
తెలంగాణ టవర్కు 500 కోట్లు ఖర్చు
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ను ఏపీ, తెలంగాణల మధ్య గత మార్చిలో విభజించారు. మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు సమకూరాయి. ఈ మొత్తం ఆస్తి విలువ రూ.9,913.505 కోట్లుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు వచ్చిన వాటాకు వచ్చిన మూడెకరాల్లో శబరి బ్లాక్ ఉండగా, 5.245 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉంది. శబరి బ్లాక్ ఉన్న ప్రాంతంలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు విడివిడిగా బ్లాక్లు నిర్మించాలని, మిగిలిన 5.245ఎకరాల్లో రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, అధికారులు వెళ్లినప్పుడు ఉండేలా గదులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.
టౌన్ప్లానింగ్ నిబంధనల ప్రకారం ఇక్కడ బహుళ అంతస్థులు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు రెండు-మూడు నమూనాలను రూపొందించారు. 24 అంతస్థులతో తెలంగాణ టవర్ను నిర్మించనున్నట్టు ఇటీవలే రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి ప్రకటించారు. అయితే ఈ భవనాల నిర్మాణానికి దాదాపు రూ. 500 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా.
ప్రైవేట్ డెవలపర్కు అప్పగింత?
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రైవేటు డెవలపర్ ద్వారా తెలంగాణ టవర్ను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర అవసరాలకు ఎల్లప్పుడూ కనీసం 100 గదులను అందుబాటులో ఉంచి మిగిలిన అంతస్థుల్లో గదులను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతించాలని నిర్ణయించినట్టు సమాచారం.
దీని నిర్మాణానికి సంబంధించి రాష్ర్టానికి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒకటి రెండు స్టార్ హోటళ్ల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. రాష్ట్ర అవసరాలకు కావాల్సిన గదులు, వాణిజ్యానికి ఉపయోగించుకునే గదులను విడివిడి బ్లాక్లలో నిర్మించాలా, లేక మొత్తం ఒకే టవర్ను నిర్మించి అందులోనే వేర్వేరు ప్రవేశాలు ఇవ్వాలా అనేది ఇంకా తేలలేదు.