హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఫార్మా విలేజ్లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతుండగా.. తాజాగా భూముల కొరత వెంటాడుతున్నది. నల్గొండ, మెదక్, వికారాబాద్ తదిరత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా..ఈ మూడు చోట్ల భూముల లభించే పరిస్థితి లేదని ఆయా జిల్లా కలెక్టర్లు తేల్చిచెప్పారు. అయితే జహీరాబాద్లో భూసేకరణ అవకాశం ఉండగా, వికారాబాద్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తున్నది. దీంతో మొదటిదశలో ఈ రెండు ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమారుగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 10 ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని ఈ ఫిబ్రవరిలో జరిగిన బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో 1000 నుంచి 2 వేల ఎకరాల స్థలంలో ఈ విలేజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫార్మా పరిశ్రమలు కాలుష్యంతో కూడిన రెడ్ జోన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి, వీటి ఏర్పాటునకు స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.
పరిశ్రమల ఏర్పాటునకు సంబంధించి పర్యావరణ వ్యవస్థ(ఎకోసిస్టం) అభివృద్ధి కావడం ఎంతో ముఖ్యం. ఉదాహరణకు రాష్ట్రంలో అనేక దిగ్గజ ఐటీ కంపెనీలు ఉన్నాయి. దీంతో వాటికి అనుబంధంగా పెద్ద సంఖ్యలో చిన్నాచితకా ఐటీ కంపెనీలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి పర్యావరణ వ్యవస్థ లేకుండా పరిశ్రమల మనుగడ సాధ్యంకాదు. ఫార్మా రంగం విషయానికొస్తే, ఇప్పటికే జీడిమెట్ల, బాలానగర్, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమలు కొలువుదీరాయి. జీనోమ్ వ్యాలీలో అనేక కంపెనీలు తమ పరిశోధన కేంద్రాలను నెలకొల్పాయి.