Paddy Procurement | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించివేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరి సాగు విస్తీర్ణంలో తగ్గుదల లేకపోయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం తగ్గిపోయాయి. 2019-20లో 64.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా, తాజాగా 2023-24 యాసంగి (ప్రస్తుత సీజన్)లో పౌరసరఫరాల సంస్థ కేవలం 48 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019-20 నుంచి ఏటేటా ధా న్యం కొనుగోళ్ల పరిమాణం పెరుగుతూ వ చ్చింది. మొదటిసారిగా ఈ యాసంగి సీజన్ లో కొనుగోళ్లు తగ్గినట్టు తెలుస్తున్నది. ఇందు కు ప్రభుత్వ, పౌరసరఫరాలశాఖ వైఫల్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు వస్తాయా? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో 2018-19 వరకు కూడా వరి తక్కువగానే సాగయ్యేది. అప్పటివరకు కూడా ధాన్యం కొ నుగోళ్లు 37 లక్షల టన్నులు మించలేదు. కానీ 2019-20 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది పౌరసరఫరాల సంస్థ చరిత్రలో మొదటిసారిగా 64.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
ఆ తర్వాత 20 20-21లో రికార్డును సృష్టించింది. కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఏకంగా 92.28 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇది ఉమ్మడి ఏపీలో చరిత్రలో కూడా సాధ్యం కా లేదు. ఇక 2021-22లో కేంద్ర ప్రభుత్వం వరి సాగుపై ఆంక్షలు పెట్టినా.. కొనుగోళ్లు 50.39 లక్షల టన్నులకు చేరింది. నిరుడు 65.82 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. కానీ 2023-24లో మళ్లీ తగ్గుదల నమోదైం ది. కాంగ్రెస్ ప్రభుత్వం 48 లక్షల టన్నులతో సరిపెట్టింది. గతేడాదితో పోల్చితే ఏకంగా 18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి.
నిరుటితో పోల్చితే వరి సాగులో పెద్దగా తగ్గుదల లేకపోయినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం భారీగా తగ్గడం సందేహాలను రేకెత్తిస్తున్నది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొన్నటి యాసంగిలో 50.59 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాగు 5.85 లక్షల ఎకరాలు తగ్గగా.. ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గింది.
గత యాసంగిలో 65.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన బీఆర్ఎస్ ప్రభు త్వం రైతులకు రూ.13,531 కోట్లు చెల్లించింది. ఈ యాసంగిలో 48 లక్షల టన్నుల ధా న్యం కొనుగోలు చేసిన కాంగ్రెస్ సర్కారు రైతులకు రూ.10,547 కోట్లు చెల్లించింది. అంటే గత యాసంగితో పోల్చితే రైతులకు రూ. 3వేల కోట్ల చెల్లింపులు తగ్గడం గమనార్హం.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. యాసంగిలో కొనుగోలు లక్ష్యం 75 లక్షల టన్నులు కాగా కొన్నది కేవలం 48 లక్షల టన్నులు మాత్రమే. ఇది ప్రభుత్వ వైఫల్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. వరి కోతలు మొదలైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నప్పటికీ కొనుగోళ్లలో వేగం పెంచలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు. తక్కువ ధరకే విక్రయించి నష్టాలను మూటగట్టుకున్నారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి సాగునీటి గోసను తీర్చారు. అప్పటివరకు అత్తెసరుగా సాగిన వరి సాగు.. 2019-20 నుంచి దూసుకెళ్లింది. ఏడాదికేడాది పెరుగుతూ పోయింది. ఒక ఏడాది వరిసాగులో తెలంగాణ ఆల్టైం రికార్డును సృష్టించింది.