నిజామాబాద్: గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం నిజామాబాద్ పట్టణానికి తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన ఇందూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం డీఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలించున్నారు. డీఎస్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ భౌతికకాయానికి నివాళులర్పించారు.