చేర్యాల, జూన్ 30 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) సందడిగా మారింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి(Mallanna Temple) అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవ క్షేత్రం మారుమ్రోగింది. కొమురవెల్లి క్షేత్రానికి 10వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీశర్మ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయా రు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మల్లన్న ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు, తదితరులు పాల్గొన్నారు.