Gurukula Recruitment | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను ఛిద్రం చేసింది. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది. ప్రచారార్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే ఇప్పుడు రద్దు చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు దివ్యాంగ కోటాలోని పీజీటీ ఎంపికైన పదుల సంఖ్యలో అభ్యర్థులను వంచించింది. సర్కారు కొలువొచ్చిందని ఉన్న ఉద్యోగాన్ని, అవకాశాలను వదులుకుని ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వారంతా రోడ్డునపడ్డారు. వారిని ఎంపిక చేసిన పోస్టులన్నీ నేడు ఖాళీగా మారాయి. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు నిర్వాకం.
గురుకుల పోస్టులను ట్రిబ్ ఏ రీతిన భర్తీ చేస్తున్నదో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు దీనికి బాధ్యులెవరు? అని దివ్యాంగ అభ్యర్థులు నిలదీస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) మొత్తంగా 1,276 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ను జారీచేసింది. వీటిలో 115 పోస్టులు దివ్యాంగుల కోటాకు కేటాయించారు. వాటిలో విజువల్ హ్యాండీక్యాప్డ్ 105, హియరింగ్ హ్యాండీకాప్డ్ 10 ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రిబ్ పీజీటీ పోస్టుల భర్తీలో మెడికల్ టెస్టులను నిర్వహించకుండానే తుది జాబితాను ప్రకటించింది.
ఫిబ్రవరిలో ఎల్బీ స్టేడియం వేదికగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ బోర్డులకు అభ్యర్థులను పంపి వైకల్య పరీక్షలను నిర్వహించింది. అందులో భాగంగా హియరింగ్ హ్యాండీకాప్డ్ పోస్టులకు సంబంధించి 40 మందికిపైగా అభ్యర్థులకు కోఠి ఈఎన్టీ దవాఖానకు పంపగా, అందులో 36 మందికి పైగా అభ్యర్థులు అనర్హులుగా సదరు మెడికల్ బోర్డు తేల్చింది. ఆ మేరకు 36 మంది అభ్యర్థుల పోస్టింగ్ ఆర్డర్లను ఇప్పుడు సొసైటీలు రద్దుచేశాయి. ఇతర మెడికల్ బోర్డుల నుంచి కూడా తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. దీంతో దివ్యాంగుల కోటా పోస్టుల్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్లాగ్లో పడినట్టు అభ్యర్థులే తేల్చి చెప్తున్నారు.
ట్రిబ్ తీరువల్ల మరో వైపు 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులకు సైతం తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేస్తే మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థితో మిగిలిన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండేది. ట్రిబ్ దీనిని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులన్నీ బ్యాక్లాగ్లో పడిపోతున్నాయి.
పీజీటీ పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పొంది.. తిరస్కరణకు గురైన దివ్యాంగ అభ్యర్థులెందరో ఇప్పుడు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే క్రమంలో అప్పటికే ప్రభుత్వ సర్వీస్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ (నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)ను నమోదు చేయాలని ట్రిబ్ షరతు విధించింది. ఆ మేరకు అప్పటికే వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు సైతం ఎన్వోసీలను సమర్పించారు.
పీజీటీ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వడంతో పలువురు దివ్యాంగ అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలిపెట్టారు. తీరా ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇటు ఉద్యోగం రాక, ఉన్న ఉద్యోగం కోల్పోయి యాతన పడుతున్నారు. పైస్థాయి పోస్టుకు ఎంపికైన ఎందరో కింది స్థాయి పోస్టుల ఎంపికకు మెరిట్ ఉండీ హాజరుకాక తీ వ్రంగా నష్టపోయారు. ట్రిబ్ నిర్వాకం వల్ల తమ జీవితాలు త్రిశంకుస్వర్గంలో తేలియాడుతున్నాయని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు.
ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు.. బంధువులు, స్నేహితులతో గర్వంగా చెప్పుకున్నారు.. కానీ ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి సంతోషం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తలెత్తుకు తిరగలేకపోతున్నామని బాధిత దివ్యాంగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటే వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే తమకు ఇంత మానసిక క్షోభ మిగిలి ఉండేది కాదని సదరు అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈమె పేరు రేణుక. దివ్యాంగుల కోటాలో మల్టీ జోన్-1లో బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులో పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుకు ఎంపికయ్యారు. టీజీటీ పోస్టుకూ ఎంపికయ్యారు. టీజీటీని వదిలేసి పీజీటీ పోస్టును ఎంచుకోగా, గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు. తీరా ఇప్పుడు నిర్దేశిత వైకల్యశాతం లేదని పీజీటీ పోస్టు అపాయింట్మెంట్ ఆర్డర్ను అధికారులు రద్దుచేశారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఇది ఒక్క రేణుక పరిస్థితే కాదు.. పీజీటీ పోస్టులకు పదుల సంఖ్యల అభ్యర్థులకు ఎదురైన దుస్థితి.