Congress | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ అధిష్ఠానం.. ఇకపై ఆయన నిర్ణయాలకు కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు ఆమోదం తెలపకుండా పార్టీలోని ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్టు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేటెడ్ పోస్టులు మొదలు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ వరకు ప్రతి అంశంలోనూ అధిష్ఠానం మునుపటిలా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వివరించారు. గతంలో సీఎం రేవంత్రెడ్డి ఎంత చెప్తే అంతే అని తల ఊపిన అధిష్ఠానం.. ఇటీవల ఆయన ప్రతిపాదించిన నామినేటెడ్ పోస్టులకు ఓ పట్టాన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.
పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కూడా సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం తెలుసుకున్న అధిష్ఠానం, పార్టీలో సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులను ఢిల్లీకి పిలిపించుకొని వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుందని వివరించారు.
మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలనే అంశంపై కూడా సీఎం రేవంత్రెడ్డితోపాటు సీనియర్లతో కూడా అధిష్ఠానం పెద్దలు చర్చించినట్టు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రతిపాదనలను ఒకరిద్దరు సీనియర్లు వ్యతిరేకించడంతో.. వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిపించి ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నది. లోక్సభ ఎన్నికల సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ఏకపక్షంగా ప్రకటించడాన్ని సీనియర్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, నామినేటెడ్ పోస్టుల ఎంపికలో జిల్లా మంత్రులకు తెలియకుండా జాబితా ప్రకటించారని వారు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఎంపీ ఎన్నికల వరకు జరిగిన అన్ని పరిణామాలపై ఆరా తీసిన అధిష్ఠానం, ఇక ముందు అలా ఉండదని, సమిష్టిగా తీసుకునే నిర్ణయాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై సీనియర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆ తరువాత సీఎం రేవంత్రెడ్డితో చర్చించింది. పార్టీ టికెట్పై గెలిచిన వారికే మంత్రి పదవులు, ఇస్తామని, ఎన్నికల్లో పోటి చేయడానికి వివిధ కారణాల వల్ల అవకాశం దక్కని వారికే తప్ప ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని తాము సూచించామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
ఇదే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్లో వెల్లడించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకంలోనూ సీఎం రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయం కాకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో తమ ముద్ర తప్పకుండా ఉంటుందన్న ధీమాను సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.