Jangaon | జనగామ, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి రాజకీయ రంగు పులిమి కూల్చివేసేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేసినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింత రవి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని గ్రామ కాంగ్రెస్ నాయకులు కొందరు ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి లేదనే సాకుతో విగ్రహం కూల్చివేత కుట్రకు తెరలేపారు. ఎ మ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇన్చార్జి అయిన ఝాన్సీరెడ్డి, మండల అధికారులు కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గురువారం సాయంత్రం విగ్రహం కూ ల్చివేతలకు పంచాయతీ సిబ్బంది సిద్ధపడ్డారు.
అడ్డుకున్న స్థానిక మహిళలు
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అడుగు భాగాన్ని పెకిలించేందుకు పంచాయతీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు తగవని, కూల్చివేత ఆపాలని గొడవకు దిగడంతో ఎట్టకేలకు కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. దేవరుప్పుల ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎస్ఐ చెన్నకేశవులు, ఎంపీవో సురేశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి అంజలి, ఇతర గ్రామాల సెక్రటరీలు గ్రామపంచాయతీ సిబ్బందిని పురమాయించి విగ్రహాన్ని కూలగొట్టేందుకు ఉపక్రమించారు.
స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిపివేశారు. రెండేండ్ల క్రితం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింత రవి గద్దెను నిర్మించగా, కాలనీకి చెందిన కొందరు వ్యతిరేకించడంతో అంబేద్కర్ విగ్రహాన్ని కామారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన నెలకొల్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి ఆర్థిక సహాయం అందించి విగ్రహాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సీ కాలనీలో వృథాగా ఉన్న గద్దెకు గులాబీరంగు వేసి దాతల సాయంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది.
తెలంగాణ తల్లి అందరిదీ అని, గద్దెకు వేసిన గులాబీరంగును మార్చుతానని చింత రవి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేతో విగ్రహాన్ని ప్రారంభిద్దామని చెప్పినా కాంగ్రెస్ నాయకులు వినిపించుకోలేదని చెప్తున్నారు. గద్దెతోపాటు విగ్రహానికి కప్పిన గులాబీరంగు వస్ర్తాన్ని సైతం మార్చినా కాంగ్రెస్ నాయకులు పట్టువీడలేదు. కేవలం చింత రవి ఏర్పాటు చేశాడన్న నెపంతో విగ్రహాన్ని కూలగొట్టాలనడం వివాదాస్పదమైంది.