హైదరాబాద్ : మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని డీఎస్సీ అభ్యర్థులు( DSC candidates) రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. టీచర్ల ప్రమోషన్స్తో ఖాళీగా మిగిలిన పోస్టులను ఈ డీఎస్సీలో లోనే జత చేయాలని, పరీక్ష నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ(Congress pary) అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు మరో 6 వేల పోస్టులు మాత్రమే కలిపి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్(Promotions of teachers) ప్రక్రియ ముగింపు దశలో ఉన్నందున కొత్తగా ఏర్పడిన 15 వేల టీచర్ పోస్టులు ప్రస్తుత డీఎస్సీలోనే జత చేసి 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.
డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో రద్దు చేసి ఆప్లైన్లో చేపట్టాలి. ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వివిధ లైబ్రరీ హాల్స్, స్టడీ సెంటర్స్ వద్ద అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.