హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): ‘రేవంత్రెడ్డితోనే మాకు అసలు సమస్య. ఆయన ఒంటెద్దు పోకడలను భరించలేకపోతున్నాం. సీనియర్లను కించపరుస్తున్నారు. ఆయన తన విధానాన్ని మార్చుకుంటే మాకెలాంటి సమస్య లేదు’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేకు ఆ పార్టీ సీనియర్లు ఏకరువు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఇటీవలే నియమితులైన ఆయన తొలిసారిగా బుధవారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా పలువురు సీనియర్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహారశైలిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కమిటీల్లో అసలైన కాంగ్రెస్వాదులుకు చోటు దక్కకపోడం, పార్టీలో కొందరే కీలకంగా వ్యవహరించడం, సీనియర్లను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
రేవంత్రెడ్డిని అదుపులో పెట్టాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని వారు సూచించినట్టు తెలిసింది. వీటన్నింటినీ సావధానంగా విన్న ఠాక్రే.. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, రేవంత్రెడ్డి గురించి వదిలేసి ఎవరి పని వారు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఇక ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గాంధీభవన్కు వచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. రాష్ర్టానికి వచ్చిన ఠాక్రే.. వెంకట్రెడ్డికి ఫోన్ చేసి గాంధీభవన్కు రావాల్సిందిగా కోరినట్టు సమాచారం. అయితే తాను గాంధీభవన్కు రాలేనని, తమను బయట కలుసుకుంటానని చెప్పినట్టు తెలిసింది.