CM Revant Reddy | సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 41 శాతం వాటాలున్న విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటాయింపు కీలకమైనందున, సింగరేణికే వాటిని కేటాయించాలని ప్రధానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానమంత్రి నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంటసేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి మోదీతో చర్చించారు. ప్రధానమంత్రి మోదీతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.
2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించిందన్నారు. 2014 తర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదని, హైదరాబాద్కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.