హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీకి తాను సిద్ధమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చేసిన భేటీ ప్రతిపాదనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు మంగళవారం సీఎం రేవంత్ తిరిగి లేఖ రాశారు. ఇప్పటికే విభజన సమస్యలపై ఇద్దరం సమావేశమై చర్చించుకుందామంటూ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి ఇందుకు అంగీకరిస్తూ ప్రత్యుత్తరమిచ్చారు. ‘మీరు నాకు రాసిన లేఖను చదివాను.
అందులో నా గురించి మంచి వ్యాఖ్యలు ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు సాధించిన అపూర్వ విజయానికి నా అభినందనలు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి దేశంలోని అతికొద్ది మంది రాజకీయ నేతల సరసన చేరారు’ అని పేర్కొన్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇద్దరం సమావేశమై ఆలోచనలను పంచుకోవటం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. ఇరు రాష్ర్టాల ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ సమావేశంలో చర్చించే అంశాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న సాయంత్రం మహాత్మా జ్యోతిరావ్పూలే ప్రజాభవన్లో భేటీ అవుదామని చంద్రబాబును ఆహ్వానించారు.